జగన్ పాలన మొత్తం నేరపూరితమే: వర్ల రామయ్య

  • ప్రకాశం బ్యారేజ్ ను ధ్వంసం చేయాలనుకున్నారన్న వర్ల
  • బోట్లు సరిగా ఢీకొని ఉంటే పెద్ద ప్రమాదం సంభవించేదని వ్యాఖ్య
  • సీబీఐ అధికారులపై కూడా కేసులు పెట్టిన ఘనత జగన్ దని విమర్శ
వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలన అంతా నేరపూరితమే అని ఆయన చెప్పారు. ప్రకాశం బ్యారేజ్ ను కుట్ర పూరితంగా ధ్వంసం చేయాలని అనుకున్నారని... ఇది దేశ ద్రోహమని అన్నారు. ప్రకాశం బ్యారేజ్ ను బోట్లు ఢీకొనేలా జగన్ ప్లాన్ చేశారని ఆరోపించారు. 

ఒకవేళ ఈ బోట్లు బ్యారేజ్ ను సరైన విధంగా ఢీకొని ఉంటే దివిసీమ ఉప్పెన కంటే పెద్ద ప్రమాదం సంభవించి ఉండేదని అన్నారు. బ్యారేజ్ కింద ఉన్న ఊర్లన్నీ మునిగిపోయి ఘోరమైన విపత్తు సంభవించి ఉండేదని చెప్పారు. 

వైఎస్ వివేకాను హత్య చేసిన కేసులో సీబీఐ అధికారులపై కూడా కేసుల పెట్టిన ఘనత జగన్ దని వర్ల మండిపడ్డారు. కోడికత్తి కేసులో ఒక దళిత యువకుడిని ఐదేళ్లు జైల్లో పెట్టించింది కూడా జగనేనని విమర్శించారు. గత ఎన్నికల్లో కూడా జగన్ గులకరాయి డ్రామా ఆడారని ఎద్దేవా చేశారు. 

రాజకీయాల కోసం 33 మంది అవ్వాతాతల చావుకు జగన్ కారణమయ్యారని దుయ్యబట్టారు. ప్రకాశం బ్యారేజ్ ను ఢీకొన్న బోట్లకు వైసీపీ రంగులు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన వ్యక్తులు ప్రకాశం బ్యారేజ్ పై కుట్ర చేయలేదంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు.

Varla Ramaiah
Telugudesam
Jagan
YSRCP

More Telugu News